Suicide | నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత మృతి ఘటనలో భర్తను మృతురాలి బంధువులు కొట్టి చంపారు.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నంపల్లికి చెందిన సింధు, ఖమ్మం జిల్లాకు చెందిన నాగార్జున మూడేండ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సింధు శుక్రవారం సాయంత్రం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. అప్రమత్తమైన బంధువులు ఆమెను నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయింది సింధు. దీంతో సింధు మృతదేహాంతో బంధువులు అచ్చంపేటకు తిరుగు పయనమయ్యారు. సింధు ఆత్మహత్యకు భర్త నాగార్జునే కారణమంటూ, అతన్ని కొట్టి చంపారు. ఆమనగల్లు వద్ద నాగార్జునను కొట్టి చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాగార్జున అచ్చంపేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో పని చేస్తున్నట్లు తెలిసింది.