కొత్తగూడెం క్రైం/భద్రాద్రి కొత్తగూడెం : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చుంచుపల్లి మండల పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నారు. కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర బాబు చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సోమవారం సాయంత్రం చుంచుపల్లి ఎస్సై బి. మహేష్ తన సిబ్బందితో కలిసి బృందావనం బ్రిడ్జివద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఖమ్మం వైపు అనుమానస్పదంగా వెళ్తున్న బొలేరో వాహనాన్ని అడ్డగించి పట్టుకున్నారు.
వాహనం వెనుక ట్రక్కుని తనిఖీ చేయగా కట్ చేసిన ప్లేవుడ్ మధ్యభాగంలో ఎవరికి అనుమానం రాకుండా గంజాయి బస్తాలు అమర్చారు. వెంటనే పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర ఔరంగబాద్కు చెందిన బొలేరో డ్రైవర్ షబ్బీర్, కూలీ షంషు మీర్జా బేగ్ లను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
అదుపులోకి తీసుకున్న సదరు ఇద్దరు వ్యక్తులు మహారాష్ట్రకి చెందిన జావేద్, రసూల్, సంగారెడ్డికి చెందిన ధరమ్ సింగ్, రవిల అదేశానుసారం ఈ గంజాయిని ఆంధ్రప్రదేశ్ లోని సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బొలేరో వాహనంలో వచ్చిన ధరమ్ సింగ్, రవి భద్రాచలంలో దిగిపోయారని డీఎస్పీ తెలిపారు.
పట్టుబడిన 4.5 క్వింటాళ్ల గంజాయి విలు రూ.90 లక్షలు ఉంటుందని డీఎస్పీ వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో చుంచుపల్లి సీఐ గురుస్వామి,ఎస్సై బి. మహేష్, పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.