భద్రాద్రి కొత్తగూడెం : అతడికి అంతకుముందే వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం దాచిపెట్టి మాయమాటలతో ఓ మహిళను పెండ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆ భర్త ముఖం చాటేయడంతో బాధిత మహిళ తన కుమారుడితో కలిసి దీక్షకు దిగింది.
ఈ సంఘటన జిల్లాలోని బూర్గంపహాడ్ మండలం సారపాకలోని క్రీస్తుసంఘం చర్చి వద్ద చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాత సారపాకకు చెందిన శెట్టిమల్ల సులోచనను మారేడుమిల్లికి చెందిన సువర్ణరాజు పెండ్లి చేసుకొని సారపాకలోని క్రీస్తు సంఘం చర్చిలో ఫాదర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
కాగా, సువర్ణరాజుకు వివాహామై ఇద్దరు పిల్లలున్నప్పటికి తనకు ఏమీ చెప్పకుండా మాయమాటలు చెప్పి పెద్దల సమక్షంలోనే 2008 లో వివాహం చేసుకున్నాడని సులోచన తెలిపింది. వివాహ అనంతరం సులోచనను ఖమ్మం తీసుకువెళ్లి అక్కడ కాపురం పెట్టాడు.
అయితే వీరికి ఒక కుమారుడు శెట్టిమల్ల సుశాంత్ తేజ్ జన్మించాడు. వీరి దాంపత్య జీవితం 12 ఏళ్లు బాగానే సాగింది . గత ఏడాది కాలంగా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు తలెత్తడంతో విడిగా ఉండేందుకు పెద్దల సమక్షంలో తన కుమారుడి బాగోగులు చూసుకునేలా రూ .25 లక్షలు మనోవర్తి ఇస్తానని అగ్రిమెంట్ ద్వారా గత ఏడాది 29.09 2021 వ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒప్పందం ప్రకారం మనోవర్తి ఇవ్వకుండానే తప్పించుకు తిరుగుతున్నాడని, తన కుమారుడిని చూసుకునేందుకు ఆర్థిక పరిస్థితి బాగోలేక సారపాకలోని తన సోదరి వద్దకు వచ్చానని, తనకు న్యాయం జరగకపోవడంతో తన కుమారుడు సుశాంత్ కలిసి దీక్షకు దిగినట్లు బాధితురాలు తెలిపింది. పెద్దల సమక్షంలో తనకు న్యాయం చేస్తానని చెప్పిన విధంగా మనోవర్తి ఇప్పించాలని, అప్పటివరకు దీక్షను విరమించేది లేదని బాధితురాలు స్పష్టం చేసింది.
ఈ విషయం తెలుసుకున్న టీఎన్టియూసీ బాధ్యులతో పాటు పలు పార్టీలు, కులసంఘాలకు చెందిన నాయకులు దీక్ష చేస్తున్న చర్చి వద్దకు చేరుకుని బాధితురాలికి అండగా ఉంటామన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలంటూ అధికారులను కోరారు.