బ్యాంకాక్ : పెండ్లి వేడుకలు జరుగుతుండగానే పెండ్లి కొడుకు కాల్పులకు తెగబడుతూ మారణ హోమం సృష్టించాడు. వధువుతో సహా నలుగురుని కాల్చిచంపి ఆపై తనపై తాను కాల్పులు జరుపుకున్న ఉదంతం థాయ్ల్యాండ్లో వెలుగుచూసింది. వాంగ్ నాం ఖియో జిల్లాలోని ఓ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. మాజీ సైనికుడు, పారాఒలింపిక్ అథ్లెట్ 29 ఏండ్ల చతురంగ్ సుక్సుక్ కొన్నేండ్లుగా కాంచన పఛున్థీక్ (44)తో సహజీవనం చేస్తున్నాడు.
వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకోగా శనివారం ఉదయం పెండ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. సుక్సుక్ అర్ధంతరంగా పెండ్లి వేడుక నుంచి బయటకు వచ్చి ఆపై తుపాకీతో తిరిగివచ్చాడు. సుక్సుక్ వచ్చీరాగానే వధువుతో వాగ్వాదానికి దిగి ఆమెపై కాల్పులతో విరుచుకుపడ్డాడు. సుక్సుక్ కాల్పులు జరపడంతో పెండ్లి కూతురు కాంచనతో పాటు ఆమె తల్లి (62), సోదరి (38) మరణించగా, ఆపై తనపై తాను కాల్పులు జరుపుకున్నాడు.
ఇక ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు అతిధులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు చికిత్స పొందుతుండగా మరొకరి పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది. ఆ సమయంలో పెండ్లి కొడుకు మద్యం సేవించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. తాను వైకల్యంతో బాధపడుతుండటంతో తన భార్య మరొకరితో వెళ్లిపోతుందనే అనుమానంతోనే పెండ్లి కొడుకు ఈ దుర్ఘటనకు తెగబడ్డాడని భావిస్తున్నారు.
Read More :
Israel informers killed | ఇజ్రాయెల్ ‘ఇన్ఫార్మర్ల’ను దారుణంగా చంపి.. మృతదేహాలు వేలాడదీత