వెస్ట్ బ్యాంక్: ఇజ్రాయెల్కు ‘ఇన్ఫార్మర్లు’గా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను పాలస్తీనాకు చెందిన ‘రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ ఉగ్రవాదులు దారుణంగా చంపారు. (Israel informers killed) వారి మృతదేహాలను ఈడ్చుకెళ్లి స్తంభానికి వేలాడదీశారు. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 6న వెస్ట్ బ్యాంక్లోని తుల్కరేమ్ శరణార్థి శిబిరానికి చెందిన ఇద్దరు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ భద్రతా దళాలకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ ఆ శిబిరంపై దాడి చేసింది. పాలస్తీనాకు చెందిన ముగ్గురు కీలక ఉగ్రవాదులను హతమార్చింది.
కాగా, ఈ సంఘటన నేపథ్యంలో శనివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంక్లోని ఆ శరణార్థి శిబిరానికి పాలస్తీనా మిలిటెంట్లు చేరుకున్నారు. ఇజ్రాయెల్కు ఇన్ఫార్మర్గా పని చేసిన ఇద్దరు పాలస్తీనియన్లను చంపారు. వారి మృతదేహాలను వీధుల్లో ఈడ్చుకెళ్లగా అక్కడి జనం కాళ్లతో తన్నారు. అనంతరం ఒక విద్యుత్ స్తంభానికి మృతదేహాలను వేలాడదీశారు. మృతులను 31 ఏళ్ల హంజా ముబారక్, 29 ఏళ్ల ఆజం జుబ్రాగా గుర్తించినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.
మరోవైపు పాలస్తీనాకు చెందిన ‘రెసిస్టెన్స్ సెక్యూరిటీ’ సంస్థ ఈ సందర్భంగా ఒక హెచ్చరిక జారీ చేసింది. ‘ఏ ఇన్ఫార్మర్ లేదా ఏ దేశద్రోహిని ఊపేక్షించబోం. మా యోధుల హత్యకు సంబంధించిన కేసులో ప్రమేయం ఉన్నట్లు రుజువైతే మేం దాడి చేస్తాం. వెంబడించి మరీ మరణశిక్ష విధిస్తాం’ అని పేర్కొన్నట్లు ఇజ్రాయెల్కు చెందిన న్యూస్ ఛానల్ వెల్లడించింది.