న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధినిని వేధించిన రైల్వే ఉద్యోగిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై హోంమంత్రిత్వ శాఖ వెబ్సైట్లో రాజస్ధాన్లోని అజ్మీర్కు చెందిన విద్యార్ధిని (20) ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఫేక్ ఐడీలను ఉపయోగించి పలు సోషల్ మీడియా వేదికలపై గుర్తుతెలియని నిందితుడు తనపై పోస్టులు పెడుతున్నాడని ఫిర్యాదులో ఆమె ఆరోపించింది.
ఈ వ్యవహారంలో తన మాజీ ఫ్రెండ్ పాత్ర ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. బాధితురాలి పిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఏప్రిల్ 7న తన కాలేజ్ వెలుపల ఓ వ్యక్తి తిరుగుతూ తనను వెంబడిస్తున్నాడని బాధితురాలు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా నిందితుడు కూడా బాధితురాలి ప్రాంతానికి చెందిన వాడేనని గుర్తించారు. ఐదేండ్ల కిందట ఓ సోషల్ మీడియా యాప్ ద్వారా నిందితుడు బాధితురాలితో పరిచయం ఏర్పడింది. ఆపై నిందితుడితో మాట్లాడటాన్ని ఆమె నిలిపివేసింది. దీంతో బాధితురాలి వెంటపడి వేధింపులకు గురిచేస్తున్నట్టు వెల్లడైంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.