మారేడ్పల్లి : రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేసి తప్పించుకొని తిరుగుతున్న వారిద్దరి నుంచి రూ. 23 లక్షల విలువ చేసే 55 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ డాక్టర్ బీ అనురాథ మీడియాతో మాట్లాడుతూ.. జార్ఖండ్కు చెందిన రంజన్ కుమార్(63) బట్టల వ్యాపారం, యూపీ వాసి రాజీవ్ రట్రోజి(42) కృత్రిమ ఆభరణాల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే రైళ్లలో తమ వ్యాపారం చేస్తున్న సందర్భంగా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆదాయం సరిపోకపోవడంతో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో రంజన్, రాజీవ్ కలిసి రైళ్లలో బంగారు ఆభరణాలను చోరీ చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నారు. గౌతమి, చార్మినార్, ఈస్ట్ కోస్ట్, నాగర్సోల్, కోకనాడ ఎక్స్ప్రెస్, హంసపర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో చోరీలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరిద్దరిపై ఇప్పటి వరకు 11 కేసులు నమోదు కాగా, సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో 8 కేసులు, నాంపల్లిపరిధిలో ఒకటి, సామర్లకోట పరిధిలో 2 కేసులు నమోదు అయినట్లు తెలిపారు.
ఇటీవల కోకనాడ ఎక్స్ప్రెస్ రైల్లో రంజన్, రాజీవ్ కలిసి ప్రయాణికుల బ్యాగుల్లోని ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు రైల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. బుధవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రాజీవ్, రంజన్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.