కొండాపూర్ : గచ్చిబౌలి అంజయ్యనగర్లో బుధవారం హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. ప్రధాన రోడ్డులో ఉన్న ఓ భవనానికి ఉన్న ఆటోమెటిక్ షట్టర్లో ఇరుక్కుపోయి పదకొండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను రాయదుర్గం పోలీసులు వెల్లడించారు…
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన అర్జున్ కుమార్ తన భార్య దేవి, కుమారులతో కలిసి గచ్చిబౌలి అంజయ్యనగర్లో ఉన్న కేఎన్ఆర్ స్వ్కేర్ భవనంలో నివసిస్తున్నారు. అర్జున్ అదే భవనానికి వాచ్మెన్గా విధులు నిర్వహిస్తుండగా,కుమారులు భాను ప్రకాశ్ (12), రాజేశ్ (11)లు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. కాగా బుధవారం తెల్లవారు జామున రాజేశ్ ఆడుకుంటూ భవనం రెండవ అంతస్తుకు వెళ్ళి ఎంతకీ తిరిగిరాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి పైకి వెళ్ళి చూడగా షట్టర్లో ఇరుక్కుపోయి వేలాడుతూ కనిపించాడు. వెంటనే షట్టర్ కిందకు దింపి చూడగా రాజేశ్ అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
భవనం షట్టర్ ఆటోమెటిక్ మోటర్ ద్వారా పని చేస్తుందని, రాజేశ్ స్విచ్ ఆన్ చేసి పొరపాటున దానిపై చేయి వేయడంతోనే షట్టర్లో ఇరుక్కుపోయి ఉండవచ్చని మృతుని తండ్రి తెలిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు అర్జున్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని రాజేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.