లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలికతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న బాలుడిని బాలిక సోదరులు ఇద్దరు అపహరించి ఆపై హత్య చేసి చెరుకు తోటలో మృతదేహాన్ని పాతిపెట్టిన ఉదంతం బరేలిలో కలకలం రేపింది. మృతుడిని తొమ్మిదో తరగతి చదివే ఫరీక్ అహ్మద్ (15)గా గుర్తించారు.
డిసెంబర్ 28న బాధిత బాలుడు అదృశ్యం కాగా అతడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తు వేగవంతం చేయడంతో బాలుడి మృతదేహం చెరుకుతోటలో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు ఫరీక్ అహ్మద్కు అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికతో సంబంధం ఉంది.
ఫరీక్ అదృశ్యమయ్యే రెండు రోజుల ముందు మృతుడితో బాలిక సోదరులకు ఘర్షణ జరిగింది. ఆపై బాలిక సోదరులిద్దరూ ఫరీక్ను అపహరించి తాడు సాయంతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. మృతదేహాన్ని చెరుకుతోటలో పాతిపెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు.