బీహార్ రాజధాని పట్నాలో దారుణం చోటుచేసుకున్నది. కోచింగ్ సెంటర్ నుంచి ఇంటికి తిరిగివస్తున్న ఓ బాలికను అపహరించిన దుండగులు.. ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలు బైపాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే, ఈ ఘటనలో నిందితులను కాపాడేందుకు కొందరు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.
పోలీసులు, బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం, 8 వ తరగతి చదువుతున్న బాధిత విద్యార్థి కోచింగ్ సెంటర్ నుంచి సాయంత్రం 6:30 గంటల సమయంలో ఇంటికి బయల్దేరింది. ఇంతలో అక్కడి వచ్చిన బాలికకు పరిచయమున్న వ్యక్తి.. ఆమెను ఓ ఆటోలో తీసుకెళ్లాడు. బైపాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్లా ప్రాంతంలోని ఓ గదిలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆయన వెంట మరో నలుగురు కూడా అమెపై లైంగిక దాడికి దిగినట్లు తెలుస్తున్నది. అనంతరం బాలికను సమీపంలోని గుడి వద్ద వదిలి పారిపోయారు. బాలిక రాత్రంతా అక్కడే పడి ఉన్నది. బాలిక ఇంటికి రాకపోవడంతో తప్పిపోయినట్లు ఆమె కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుడి సమీపంలో పడి ఉన్న బాలికను గుర్తించిన ఓ పోలీసు ఆమెను బైపాస్ పీఎస్కు తరలించాడు. అనంతరం తన మేనమామతో కలిసి బైపాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక దవాఖానకు పోలీసులు పంపారు. బాలిక వాంగ్మూలం ఆధారంగా బైపాస్ పోలీస్ స్టేషన్లో ఐదుగురు యువకులపై లైంగిక దాడి కేసు నమోదైంది. పోలీసులు నిందితిల్లో ఒకరైన ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసులో నిందితులను తప్పించేందుకు కొందరు తెరచాటు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. బాధితురాలి కుటుంబానికి డబ్బు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.