Girl Missing | మేడ్చల్లోని బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు కొద్ది గంటల్లోనే ఛేదించారు. మేడ్చల్లోని ఈడబ్ల్యూఎస్ కాలనీకి చెందిన కృష్ణవేణి అనే నాలుగేళ్ల చిన్నారి ఇంటి ఎదుట ఆడుకుంటున్న ఒక్కసారిగా అదృశ్యమైంది. బాలిక కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం. అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దింపి పాప జాడ కోసం గాలింపు చేపట్టారు.
అదే సమయంలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బాలిక జాడను గుర్తించేందుకు ప్రయత్నించారు. దర్యాప్తులో అదే కాలనీకి చెందిన సురేశ్ అనే వ్యక్తి కృష్ణవేణిని తీసుకువెళ్లినట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో కృష్ణవేణిని ఎత్తుకువెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో నిందితుడిని రైల్వే పోలీసులు గుర్తించారు. అతని నుంచి బాలిక కృష్ణవేణిని సురక్షితంగా కాపాడారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రస్తుతం బాలిక రైల్వే పోలీసులు సంరక్షణలో ఉన్నది. ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.