న్యూఢిల్లీ : బిహార్ నుంచి ఉద్యోగం కోసం దేశ రాజధానికి వచ్చిన 16 ఏండ్ల బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన తూర్పు ఢిల్లీలో వెలుగుచూసింది. పని దొరుకుతుందనే ఆశతో బాయ్ఫ్రెండ్తో కలిసి ఈనెల 27న బాలిక (16) ఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరుకుంది. వీరిని గమనించిన నిందితుడు రవికుమార్ (30)మాటలు కలిపాడు. రెంట్ కోసం ఇల్లు కావాలని వారు కోరగా ఉద్యోగం కూడా ఇప్పిస్తానని నమ్మబలికిన నిందితుడు తన ఆటోలో న్యూ అశోక్ నగర్లోని తన బంధువు ఇంటికి తీసుకువెళ్లాడు.
ఇంటికి కావాల్సిన వస్తువులను తీసుకురావాలని బాలిక బాయ్ఫ్రెండ్ను బయటకు పంపిన నిందితుడు ఒంటరిగా ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక స్నేహితుడు తిరిగిరాగా బాధితురాలు ఏడుస్తూ జరిగిన విషయం వెల్లడించింది. తాము తిరిగి బిహార్ వెళతామని వారు కోరగా ఆటోడ్రైవర్ వారిని న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో దింపాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని వారిని హెచ్చరించాడు. రైల్వే స్టేషన్లో బాలిక ఏడుస్తుండటంతో పెట్రోలింగ్లో ఉన్న పోలీస్ వివరాలు అడగ్గా ఆటోడ్రైవర్ నిర్వాకం వెల్లడించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.