ఎలాగైనా తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లిచేసుకునేందుకు ప్రేమికులు పడే కష్టాలు వర్ణనాతీతం. ఈ క్రమంలో కొందరి ప్రయత్నాలు ఫలిస్తే.. మరికొందరి ప్రయత్నాలు బెడిసికొడుతుంటాయి. ఇటీవల బెంగళూరులో ఓ వ్యక్తి తన ప్రియురాలిని దక్కించుకోవడం కోసం ప్రేయసి కుటుంబ సభ్యులకు చెప్పిన అబద్ధం చివరకు ప్రియురాలి ప్రాణం తీసింది.
ఈ విషాధ ఘటన వివరాల్లోకి వెళితే..
కర్ణాటక హసన్ జిల్లాకి చెందిన యువతి సాకమ్మ(24) యశ్వంత్పుర్లోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తోంది. అక్కడ పని చేసే అరుణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. క్రమంగా పరిచయం కాస్తా.. ప్రేమగా మారింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్న తరువాత ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సాకమ్మను ప్రేమిస్తున్నట్లు అరుణ్.. తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. మొదట వ్యతిరేకించినా.. కొన్నాళ్ల తర్వాత పెళ్లికి అంగీకరించారు. అయితే సాకమ్మ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.
కానీ సాకమ్మను ఎలాగైనా పెళ్లిచేసుకోవాలని అరుణ్ వివిధ రకాలుగా ప్రయత్నించాడు. అయినా ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి అతనికి ఒక ఐడియా వచ్చింది. అరుణ్ తన స్నేహితుడు గోపాల్ సహాయంతో సాకమ్మ బావ ప్రజ్వల్కు గోపాల్ ఫోన్ చేశాడు. ‘‘ తాను పోలీసునని, పెళ్లికి అంగీకరించలేదనే ఆందోళనలో అరుణ్ ఆత్మహత్యాయత్నం చేశాడని, ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని.. పెళ్లికి ఒప్పుకోకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని’’.. హెచ్చరించాడు. దీంతో కంగారుపడిన ప్రజ్వల్.. ఈ విషయాన్ని సాకమ్మ కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఈ విషయం తెలియగానే సాకమ్మ తీవ్ర మనస్థాపం చెందింది.
అరుణ్ ఆత్మహత్యాయత్నం వార్త వినగానే.. తనకు దూరమవుతున్నాడని ఆందోళన చెందిన సాకమ్మ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘‘అరుణ్తో పెళ్లికి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, అరుణ్ లేని జీవితం తనకు అవసరం లేదని’’.. లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాకమ్మ ఆత్మహత్యకు కారణమైన అరుణ్, గోపాల్ను అదుపులోకి తీసుకుని.. కేసు నమోదు చేశారు.