లక్నో : ఆన్లైన్ గేమ్స్లో మునిగితేలుతున్న బాలికను తల్లి మందలించడంతో బాలిక బలవన్మరణానికి పాలపడిన ఘటన కలకలం రేపింది. ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలోని బల్దేవ్ ఖేడా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని ఆరవ తరగతి చదివే విద్యార్ధిని (10)గా గుర్తించారు. బాలిక ఇటీవల తండ్రిని కోల్పోడంతో కుటుంబాన్ని పోషించేందుకు తల్లి నీతూ ఇతరుల ఇండ్లలో పనికి కుదిరింది.
చదువుపై ఆసక్తి కనబరచని బాలిక ఎక్కువ సమయం ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ గడిపేది. బాలిక ప్రవర్తతో విసిగిన తల్లి కూతురిని మందలించి ఆపై పనికి వెళ్లింది. పని నుంచి తిరిగివచ్చిన వెంటనే బాలిక విగతజీవిగా పడిఉండటం కనిపించింది. బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్ధలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టం నివేదిక అందిన తర్వాత దర్యాప్తు ముమ్మరం చేస్తామని చెప్పారు.