జైపూర్ : రాజస్ధాన్లో దారుణం చోటుచేసుకుంది. మైనర్ బాలిక(16) పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నిందితులు ఆమె ప్రైవేట్ భాగాల్లో పదునైన వస్తువులను చొప్పించారు. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం ఆల్వార్లోని తిజారా ఫ్లైఓవర్ కింద రక్తపు మడుగులో బాలికను గుర్తించిన పోలీసులు ఆమెను బుధవారం జైపూర్లోని జేకే లాన్ ఆస్పత్రికి తరలించారు. రెండున్నర గంటల పాటు ఆపరేషన్ నిర్వహించిన వైద్యులు ఆమె ప్రైవేట్ భాగాల్లో నిందితులు ఉంచిన పదునైన వస్తువులను తొలగించారు.
బాలిక పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. అంతర్గత అవయవాలు దెబ్బతినడంతో ప్రస్తుతం బాలిక ఆస్పత్రి ఐసీయూలో కోలుకుంటోంది. మరోవైపు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి 25 కిలోమీటర్ల పరిధిలోని 300 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నామని చెప్పారు.
ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశామని నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని రాజస్ధాన్ మంత్రి ప్రసాది లాల్ మీనా చెప్పారు. దోషులను త్వరలోనే పట్టుకుంటామని రాజస్ధాన్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మమతా భూపేష్ హామీ ఇచ్చారు. బాలిక కుటుంబానికి రూ 6 లక్షల పరిహారం ప్రకటించారు. ఇక సామాజిక న్యాయ శాఖ మంత్రి తికరం జూలీ కూడా బాధిత కుటుంబ సభ్యులకు రూ 3.5 లక్షల పరిహారం ప్రకటించారు.