ఢిల్లీ : మెట్రో రైళ్లు, రైల్వేస్టేషన్లు, జనసమ్మర్ధ ప్రాంతాల్లో మాటువేసి నగలు, నగదు సహా విలువైన వస్తువులను కొట్టేసే కిలేడీ ముఠా గుట్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్ మెట్రో యూనిట్ రట్టు చేసింది. ఈ ముఠాకు చెందిన ఆరుగురు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను లక్ష్మి, వర్ష, పూజ, శశి, అంచల్, యమునగా గుర్తించారు. మార్చి 30న ఢిల్లీలోని ద్వారకాకు చెందిన రోహిత్ రాజ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
మెట్రో రైలు ఎక్కేందుకు తన తల్లితండ్రులు, సోదరుడు ఆనంద్ విహార్ మెట్రో స్టేషన్కు చేరుకున్నారు. వారు ఎలివేటర్లో ఉండగా అక్కడే ఉన్న ఐదుగురు మహిళల ముఠా బ్యాగ్లో ఉన్న వాలెట్ను చోరీ చేసి ఉడాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాలెట్లో రూ లక్ష విలువైన రెండు బంగారు గొలుసులు, ఆధార్, పాన్ కార్డులతో పాటు డెబిట్ కార్డు కొంత నగదు ఉన్నాయని తెలిపారు.
కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజను పరిశీలించి హరిద్వార్లో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. తాము మెట్రో రైళ్లు, స్టేషన్లు, బస్స్టాపులు, మార్కెట్లు, రైల్వేస్టేషన్లలో నేరాలకు పాల్పడతామని నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. నిందితులు అల్పాదాయ వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళలని చెప్పారు. వీరిలో లక్ష్మి, వర్ష గతంలో పలు నేరాలకు పాల్పడినట్టు వెల్లడైందని తెలిపారు.