బెంగళూర్ : భారీమొత్తంలో రుణాలను ఇప్పిస్తామని చెబుతూ ముగ్గురు సభ్యుల బృందం వ్యాపారులను రూ 9.5 కోట్లకు మోసం చేసిన ఘటన బెంగళూర్లో వెలుగుచూసింది. నిందితులపై బెంగళూర్కు చెందిన గిరీష్(48), అరుణాచల్ ప్రదేశ్కు చెందిన తరమ్లు సుద్దనగుంటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భారీ మోసం బయటపడింది. మరో వ్యక్తి సైతం తాను రూ 3.6 కోట్లు ఈ ముఠా సభ్యుల చేతిలో మోసపోయోనని పోలీసులకు వెల్లడించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు వివేకానందకుమార్, రవి రాఘవన్, డేనియల్లు ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన గిరీష్ను కలిశారు.
గిరీష్ చేపట్టే కొత్త ప్రాజెక్టుకు రూ 150 కోట్ల రుణం ఇప్పిస్తామని నమ్మబలికారు. డేనియల్కు చెందిన ఫైనాన్షియల్ కంపెనీ తక్కువ వడ్డీకి ఈ రుణం సమకూరుస్తుందని మభ్యపెట్టారు. నవంబర్ 8న గిరీష్కు ఈ మొత్తం రుణం మంజూరు చేసేందుకు అంగీకరిస్తూ డేనియల్కు చెందిన ఫైనాన్షియల్ కంపెనీ నుంచి ఈ మెయిల్ వచ్చింది. గిరీష్ ఈ రుణం కోసం డేనియల్ను కలవగా అడ్వాన్స్ కింద రూ 3 కోట్లు చెల్లించాలని కోరాడు.
దీంతో డేనియల్ ఖాతాకు రూ 2.3 కోట్లు గిరీష్ ట్రాన్స్ఫర్ చేశాడు. ఆపై రుణం మొత్తం జమ కాకపోవడంతో తాను మోసపోయానని గిరీష్ గ్రహించాడు. ఇదే తరహాలో రూ 240 కోట్లు రుణం ఇప్పిస్తామని వ్యాపారి తరమ్ను ఈ ముఠా 3.6 కోట్లకు ముంచింది. మరో బాధితుడి నుంచి సైతం నిందితులు రుణాల పేరుతో పెద్ద మొత్తం రాబట్టి మోసగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.