తమ ఇద్దరి మొబైల్స్ను ఎవరో హ్యాక్ చేశారని, సోషల్ మీడియాలో అసభ్య వీడియోలు షేర్ చేస్తున్నారని ఒక జంట వాపోయింది. తమ మొబైల్స్ హ్యాక్ చేసిన వాళ్లను పట్టుకోవాలంటూ ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా నిందితులు ఎవరో తెలియలేదు. అప్పుడే వాళ్లకు ఒక అనుమానం వచ్చింది.
ఆ తర్వాత అసలు హ్యాకర్ ఎవరో తెలిసిన ఆ దంపతులు షాకయ్యారు. ఈ ఘటన రాజస్థాన్లోని జైపూర్లో వెలుగు చూసింది. సదరు దంపతులకు 13 ఏళ్ల బాలుడు ఉన్నాడు. ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి బానిస అయిపోయిన ఆ బాలుడే.. తల్లిదండ్రుల మొబైల్స్ను ఇలా హ్యాక్ చేసినట్లు తేలింది.
వాళ్ల మొబైల్స్లో ఉన్న డేటా అంతా డిలీట్ చేసేసిన ఆ బాలుడు.. సోషల్ మీడియాలో అసభ్య కంటెంట్ పోస్ట్ చేయడమేకాకుండా, ఆ దంపతులను బెదిరించాడు కూడా. ఇదంతా ఆ కుటుంబంలోనే ఎవరో చేసి ఉండాలని అనుమానించిన పోలీసులు.. ఆ బాలుడిపై ఒక కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ క్రమంలో కుమారుడిని గట్టిగా అడగడంతో ఎవరో హ్యాకర్ తనను బెదిరించాడని, అతను చెప్పినట్లు చెయ్యకపోతే తల్లిదండ్రులను చంపేస్తానని అన్నాడని చెప్పాడు. పోలీసులు కూడా వచ్చి అతన్ని గట్టిగా అడగడంతో తనే ప్రాంక్ చేద్దామని ఇదంతా చేసినట్లు అంగీకరించాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కేసు వాపస్ తీసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు.. పిల్లలపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచాలని, వాళ్లు ఇలాంటి పనులు చెయ్యకుండా జాగ్రత్త పడాలని సూచించారు.