లాహోర్ : షాపులో చోరీ చేశారని ఆరోపిస్తూ ఓ మైనర్ బాలిక సహా నలుగురు మహిళలను నగ్నంగా నిలబెట్టి దారుణంగా హింసించిన ఘటన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని ఫైసలాబాద్లో వెలుగుచూసింది. తమను వివస్త్రలుగా మార్చి కర్రలతో కొడుతుండగా అక్కడ చేరిన వారిని బట్టలు ఇవ్వాలని మహిళలు వేడుకోవడం వైరల్ వీడియోలో కనిపించింది.
తమను విడిచిపెట్టాలని మహిళలు కన్నీటితో వేడుకున్నా నిందితులు కనికరించలేదు. గంటపాటు నలుగురు మహిళలను వీధుల్లో తిప్పారు. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి రెండు వీడియోలు వైరల్ కావడంతో పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు.
ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని త్వరలోనే మిగిలిన నిందితులందరినీ అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఈ ఘోర ఉదంతాన్ని ఓ బాధితురాలు వెల్లడించారు. తాము వ్యర్ధాలను సేకరించేందుకు ఫైసలాబాద్లోని బవా చక్ మార్కెట్కు వెళ్లామని, దాహం వేస్తుంటే ఉస్మాన్ ఎలక్ట్రిక్ స్టోర్లోకి వెళ్లి వాటర్ బాటిల్ అడిగామని తెలిపారు.
తాము చోరీ చేసే ఉద్దేశంతోనే షాపులోకి వచ్చామని షాపు యజమాని సద్దాం ఆరోపిస్తూ తమపై దాడికి దిగారని ఆరోపించారు. తమను సద్ధాం ఆయన అనుచరులు వివస్త్రలను చేసి మార్కెట్ అంతటా తిప్పారని చెప్పారు. తమ నగ్నవీడియోలనూ వారు చిత్రీకరించారని ఈ అరాచకాన్ని అక్కడ గుమికూడిన వారెవరూ వారించలేదని అన్నారు.