లక్నో : భూవివాదంతో దళిత కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్య చేయడంతో పాటు టీనేజ్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన యూపీలోని అలహాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. భూవివాదం నేపధ్యంలో దళిత కుటుంబానికి చెందిన యజమాని (50), ఆయన భార్య (47), కుమార్తె (17), కొడుకు(10)ని నిందితులు పొట్టనపెట్టుకున్నారు.
బాధితులను గురువారం ఉదయం వారి ఇంటిలో విగతజీవులుగా పడిఉండటం బంధువులు గుర్తించారు. కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి 11 మంది నిందితుల్లో 8 మందిని ఇప్పటివరకూ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. గొడ్డళ్లను ఉపయోగించి నిందితులు వీరిని దారుణంగా హత్య చేశారని పోస్ట్మార్టం నివేదికలో వెల్లడైంది. మృతదేహాల వద్ద గొడ్డలిని స్వాధీనం చేసుకున్నామని అలహాబాద్ డీఐజీ సర్వశ్రేష్ట్ త్రిపాఠి వెల్లడించారు.
భూవివాదం నేపధ్యంలో అగ్రవర్ణాలకు చెందిన కుటుంబం గతంలోనూ తమను పరుషపదజాలంతో దూషించి, వేధింపులకు గురిచేసిందని బాధిత కుటుంబసభ్యుల బంధువులు తెలిపారు. నిందితులపై పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.