లక్నో : ఉత్తరప్రదేశ్ లక్నోలోని హజ్రత్గంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్లో లివానాలో మంటలు చెలరేగిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు ఊపిరాడక గదుల్లో స్పృహతప్పి పడిపోయారు. ఇందులో పరిస్థితి విషమంగా ఉన్నది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
హజ్రత్గంజ్లోని సుల్తంగంజ్ ప్రాంతంలో ఉన్న లివానా హోటల్లో సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో పలువురు గాయపడగా.. వారిని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు 20 మందికిపైగా హోటల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. మరికొందరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీగా పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక చాలా మంది స్పృహతప్పి పడిపోయారని అధికారులు పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి 15 ఫైరింజన్లను తరలించారు.
హోటల్లో మొత్తం 30 గదులు ఉండగా.. అందులో 18 గదుల్లో.. పలువురు ఉన్నారని జిల్లా మెజిస్ట్రేట్ సూర్యపాల్ గంగ్వార్ తెలిపారు. గదుల్లో 30 నుంచి 35 మంది ఉన్నారు. మొదటి అంతస్తులో బాంకెట్ హాల్ ఉందని, ఇందులో చాలా మంది ఉన్నారన్నారు. ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తు చేయాలని డివిజనల్ కమిషనర్, సీపీ సంయుక్త కమిటీని ఆదేశించారు. ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ప్రమాదంలో గాయపడ్డ వారిని సివిల్ ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.