ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో పోలీసులు నకిలీ సీబీఐ అధికారుల ఆటకట్టించారు. సీబీఐ అధికారులమంటూ ఓ వ్యాపారవేత్తను బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేసిన నలుగురు నిందితులను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నలుగురు వ్యక్తులు గోరెగావ్లోని ఆస్తిక్ ట్రేడింగ్ సెంటర్లోకి వెళ్లారు.
దాని యజమాని అయిన వ్యాపారికి తమను తాము సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకుని, అతని అక్రమాలపై దర్యాప్తుకు వచ్చామని చెప్పారు. కేసు నుంచి బయటపడాలంటే రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యాపారికి నకిలీ సీబీఐ ఐడీ కార్డులు, పోలీస్ ఐడీ కార్డులు చూపించారు. వారి తీరును అనుమానించిన వ్యాపారి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దాంతో హుటాహుటిన ట్రేడింగ్ సెంటర్కు చేరుకున్న పోలీసులు నలుగురు నకిలీ సీబీఐ అధికారులను అక్కడే అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితులపై చాలా కేసులు ఉన్నట్లు తేలింది. గతంలో కూడా వాళ్లు ఇదే తరహాలో పలు నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. ముంబైలోని పలు పోలీస్స్టేషన్లలో వాళ్లపై కేసులు ఉన్నట్లు గుర్తించారు.
ఈ ముఠా ధనవంతులను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతుందని పోలీసులు తెలిపారు. తాము టార్గెట్ చేసిన వ్యక్తి వివరాలు అన్నీ తెలుసుకుని, ఏవైనా లోపాలు దొరికితే పోలీస్ అధికారులుగా అతని ముందు ప్రత్యక్షమవుతారని, భయపెట్టి డబ్బు గుంజుతారని ముంబై పోలీసులు తెలిపారు.