న్యూఢిల్లీ : విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురిచేసిన కేసులో త్రిపుర మాజీ మంత్రి మెవార్ కుమార్ జమతియాపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వేధింపుల ఘటనకు సంబంధించి త్రిపురకు చెందిన బాధితురాలు మంగళవారం రాత్రి డిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేసి ఆపై అదుపులోకి తీసుకున్నారు. లైంగిక వేధింపుల కేసుపై మాజీ మంత్రిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం త్రిపుర ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న జమతియ అరెస్ట్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామని ఢిల్లీలోని త్రిపుర భవన్ జాయింట్ రెసిడెంట్ కమిషనర్ రంజిత్ దాస్ వెల్లడించారు. ఢిల్లీలో చదువుతున్న త్రిపుర విద్యార్ధిని స్టేట్మెంట్ను ఢిల్లీ పోలీసులు రికార్డు చేశారు.