రాంచీ : ఇద్దరు బాలికలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాంచీలోని ధ్రువ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్జన ప్రదేశంలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తనను తన స్నేహితురాలిని ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని తాము ఎలాగోలా తప్పించుకుని అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేశామని బాధితురాలు వెల్లడించారు.
బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుపదన ప్రాంతానికి చెందిన బాలిక గురువారం బంధువుల ఇంటికి వెళ్లింది. బాలికను ఇంటి వద్ద డ్రాప్ చేయాలని ఆమె బంధువు పొరుగింటి వ్యక్తిని కోరింది. అయితే అతడు ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక వేధింపులకు గురిచేశాడు.
ఐదుగురు ఫ్రెండ్స్కు ఫోన్ చేయగా అక్కడకు చేరుకున్న వారు ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికను అంతటితో వదలని నిందితులు ఆమె స్నేహితురాలికి ఫోన్ చేయించి అక్కడికి పిలిపించి ఆమెపైనా లైంగిక దాడికి తెగబడ్డారు. బాలికలను అక్కడే వదిలివేసిన నిందితులు పరారయ్యారు. ప్రత్యేక బృందంగా ఏర్పడిన పోలీసులు శుక్రవారం ఉదయం ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.