లక్నో : స్వామీజీలు, బాబాల ముసుగులో ఆధ్యాత్మికవేత్తలుగా చెలామణి అవుతూ ఆశ్రమాల్లో అసాంఘిక కార్యకలాపాలతో చెలరేగే నకిలీ బాబాల ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. తాజా ఘటనలో పూజలు చేస్తానని చెబుతూ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన స్వామీజీ ప్రఖార్ మహరాజ్పై కాన్పూర్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2020 ఫిబ్రవరిలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూర్ నుంచి తల్లితండ్రులతో వచ్చిన బాలికతో అదే కార్యక్రమానికి వచ్చిన స్వామీజీ ప్రఖార్ మహరాజ్ పరిచయం పెంచుకున్నాడు.
బాలికచే పూజలు జరిపిస్తానని తల్లితండ్రులతో నమ్మబలికిన స్వామీజీ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపెడితే తల్లితండ్రులను చంపేస్తానని బెదిరించడంతో బాలిక నోరుమెదపలేదు. స్వామీజీ వద్ద ఉండిపోయిన బాలికను హరిద్వార్లోని శంకరాచార్య రోడ్డులోని విశ్వనాధ్ ఆశ్రమానికి నిందితుడు తీసుకువెళ్లాడు.
తమ బాలికను తిరిగి తమకు అప్పగించాలని తల్లితండ్రులు కోరగా ఆశ్రమ నిర్వాహకులు తమపై దాడిచేశారని ఆరోపించారు. ఉత్తరాఖండ్ అధికారులు కూడా సాయం చేయకపోవడంతో రాష్ట్ర మహిళా కమిషన్ను ఆశ్రయించామని వారు తెలిపారు. మహిళా కమిషన్ జోక్యంతో కాన్పూర్ పోలీసులు ప్రఖార్ మహరాజ్పై లైంగిక దాడి సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.