మొయినాబాద్ : మహేంద్ర ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక యువకుడు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని మేడిపల్లి గ్రామానికి చెందిన బూర్ల విష్ణువర్ధన్ (20) ఆటోడ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే మూడు ఏండ్ల క్రితం వికారాబాద్లోని మహేంద్ర ఫైనాన్స్ వద్ద ట్రాలీ ఆటో కొనుగోలు చేశాడు. కొన్ని రోజులు వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లించాడు. ఫైనాన్స్ డబ్బులు సక్రమంగా కట్టకపోవడంతో గతంలో రెండుసార్లు ఫైనాన్స్ సంస్థ ట్రాలీ ఆటోను సీజ్ చేసి తీసుకెళ్లారు. అనంతరం డబ్బులు కట్టి ఆటో తెచ్చుకున్నాడు. కరోనా నేపథ్యంలో ట్రాలీ ఆటోకు పని లేక ఏడు నెలలుగా డబ్బులు కట్టడం అతనికి ఇబ్బందిగా మారింది. ఏడు నెలల నుంచి డబ్బులు కట్టలేదని మహేంద్ర ఫైనాన్స్ సంస్థ వారు బుధవారం ఇంటికి వచ్చారు.
ఆ సమయంలో విష్ణువర్ధన్ ఇంటి వద్ద లేడు. ఫైనాన్స్ సంస్థ వారు ఇంటికి వచ్చి ఏడు నెలలుగా డబ్బులు కట్టడం లేదు, ఆటోను సీజ్ చేసి తీసుకెళ్తామని ఇంటి పక్కవారితో చెప్పారు. ఫైనాన్స్ వారు వచ్చి ఆటో సీజ్ చేస్తామని చుట్టు పక్కల వారు అతనికి చెప్పారు. డబ్బుల కోసం ఫైనాన్స్ వారు ఇబ్బందులు పెట్టడంతో పాటు ఇంటికి వచ్చి పరువు తీసారని అవమానంతో ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసే సరికి ప్యాన్ వేలాడుతూ కనిపించడంతో వెంటనే దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మృతిని సోదరుడు బూర్ల శివలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపాడు.