రాయ్పూర్: సాధారణంగా మగ ఉపాధ్యాయుల్లో కొందరు మద్యం తాగి స్కూల్కు వచ్చినట్లు వార్తలొస్తుంటాయి. దీనికి భిన్నగా ఒక మహిళా ఉపాధ్యాయురాలు మద్యం సేవించి స్కూల్కు వచ్చింది. పాఠాలు చెప్పకుండా క్లాస్రూమ్ నేలపై పడుకుంది. స్కూల్ తనిఖీకి వచ్చిన విద్యాశాఖ అధికారి ఆమెను ఆ స్థితిలో చూసి షాకయ్యారు. ఛత్తీస్గఢ్లోని జష్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆ బ్లాక్ విద్యాశాఖ అధికారి సిద్ధిక్ గురువారం ఉదయం రోటీన్ తనిఖీలో భాగంగా ఒక ప్రభుత్వ స్కూల్కు వెళ్లారు. 3, 4 తరగతలను బోధించే లేడీ టీచర్ జగపతి భగత్ నేలపై పడుకుని ఉండటం చూసి షాకయ్యారు. ఆమెకు ఆరోగ్యం బాగోలేదేమోనని తొలుత అనుకున్నారు. క్లాస్లో ఆడుకుంటున్న విద్యార్థులను అడగ్గా, టీచర్ తాగి వచ్చిందని చెప్పారు. గత కొన్ని రోజులుగా ఆమె మద్యం సేవించి స్కూల్కు రావడంపై పలు ఫిర్యాదులు కూడా వచ్చాయి.
కాగా, విద్యాశాఖ అధికారి వెంటనే స్థానిక పోలీస్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆ స్కూల్కు వచ్చారు. మద్యం సేవించి స్కూల్ క్లాస్రూమ్లో నేలపై పడుకున్న లేడీ టీచర్ను పోలీస్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రక్త నమూనాలను పరీక్షించగా ఆమె మద్యం సేవించినట్లు నిర్ధారించారు. దీంతో మహిళా ఉపాధ్యాయురాలు జగపతి భగత్ను జిల్లా విద్యాశాఖాధికారి సస్పెండ్ చేశారు.
మరోవైపు జూన్ 16న ప్రారంభమైన ఈ విద్యా సంవత్సరంలో జష్పూర్ జిల్లాలో ఇప్పటి వరకు ఐదుగురు ఉపాధ్యాయులు సస్పెండ్ అయ్యారు. అయితే వీరులో ముగ్గురు టీచర్లు మద్యం తాగి స్కూల్కు రావడం వల్ల వారిపై సస్పెన్షన్ వేటు పడింది.