ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఘోరం జరిగింది. తండ్రికి ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్న ఒక యువతి వల్ల ఆ కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. కుమార్తె తనకు నచ్చని పెళ్లి చేసుకుందని కక్షపెట్టుకున్న తండ్రి.. ఆమె ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి నిప్పుపెట్టాడు.
ఆ సమయంలో ఆమె సోదరి, సోదరి భర్త, పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. వారందరూ అగ్నికి ఆహుతయ్యారు. మంజూర్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతని కుమార్తె ఫజియా బీబీ ఏడాదిన్నర క్రితం వివాహం చేసుకుంది. ఆ వివాహం హుస్సేన్కు ఇష్టం లేదు.
ఈ క్రమంలోనే ఇటీవల ఆమె అక్క ఖుర్షీద్ మాయ్ను కలవడానికి వాళ్ల ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలిసిన హుస్సేన్ తనకుమార్తెను హతమార్చాలని అనుకున్నాడు. అక్క, బావ, వారి పిల్లలతో ఫజియా ఉండగా హుస్సేన్ ఆ ఇంటికి నిప్పుపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అనంతరం అతను పరారయ్యాడు. ఈ ప్రమాదంలో హుస్సేన్ ఇద్దరు కుమార్తెలు, అల్లుడు, నలుగురు మనుమలు కూడా మరణించారు. అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుస్సేన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.