లక్నో: ప్రేమ వివాహం చేసుకున్న కుమారుడ్ని తండ్రి హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ దారణం జరిగింది. బాన్త్రా ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల శుభమ్ సింగ్, ఐదేండ్ల కిందట అనామికా సింగ్ అకా ప్రిన్సెస్ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కుటుంబ పరువు పోయిందంటూ అతడి తండ్రి కృష్ణ కుమార్ సింగ్ అకా కాలీ సింగ్ నాటి నుంచి కుమారుడితో గొడవ పడుతుంటేవాడు. తండ్రి కొడుకులు కొన్నిసార్లు తీవ్రంగా ఘర్షణ పడేవారు. ఇలాంటి సందర్భాల్లో శుభమ్ సింగ్ భార్య అనామికా తన పుట్టింటికి వెళ్లేది.
కాగా, ఈ నెల 9న కుమారుడు శుభమ్ సింగ్ ప్రేమ వివాహంపై తండ్రి కాలీ సింగ్ మరోసారి గొడవపడ్డాడు. దీంతో అనామికా తన పుట్టింటికి వెళ్లింది. మరునాడైన గురువారం కూడా తండ్రి, కుమారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో కాలీ సింగ్, తన కుమారుడు శుభమ్ సింగ్ను హత్య చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న అనామికా వెంటనే అత్తవారింటికి వచ్చింది. రక్తం మడుగుల్లో మరణించిన భర్తను చూసి షాక్ అయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ప్రేమ వివాహం నచ్చని మామ ఎప్పుడూ కూడా తన భర్తతో గొడవ పడేవాడని ఆరోపించింది. దీంతో పోలీసులు కాలీ సింగ్ను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.