న్యూఢిల్లీ : ప్రజలను మోసగించేందుకు సైబర్ నేరగాళ్లు(cyber fraud) రోజుకో రూపంలో అమాయకుల ఖాతాల్లో సొమ్ము ఖాళీ చేస్తున్నారు. ప్రజలను మోసగించి భారీ మొత్తంలో దండుకునేందుకు సైబర్ నేరగాళ్లు డీ-మార్ట్, బిగ్ బాస్కెట్, బిగ్బజార్ వంటి నకిలీ వెబ్సైట్లు సృష్టించి దోచుకుంటున్నాయని పోలీసులు గుర్తించారు. డిస్కౌంట్ ఆఫర్లతో ప్రజలను మభ్యపెట్టి ఆపై చెల్లింపు ప్రక్రియ సందర్భంగా యూజర్ల కార్డు వివరాలను, కీలక సమాచారాన్ని స్కామర్లు కొల్లగొడుతున్నారు.
ఢిల్లీ, ఎన్సీఆర్ సహ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల ప్రజలు ఈ ముఠా ఉచ్చులో చిక్కి పెద్ద మొత్తంలో నగదును పోగొట్టుకున్నట్టు తెలిసింది. డీ మార్ట్, బిగ్బాస్కెట్, బిగ్ బజార్ పేరుతో నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేసిన ఆరుగురు సభ్యులతో కూడిన గ్యాంగ్ను నోయిడా పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వెబ్సైట్లు క్రియేట్ చేసిన స్కామర్లు నకిలీ డిస్కౌంట్లు, డీల్స్ పేరిట ప్రజలను మభ్యపెడతారు.
వీరి బారినపడి ఈ నకిలీ వెబ్సైట్ల నుంచి వస్తువులను ఆర్డర్ చేసి పేమెంట్ చేసే క్రమంలో యూజర్ల కార్డు వివరాలు, కీలక డేటాను సైబర్ నేరగాళ్లు రాబడుతుంటారు. ఆపై ఈ వివరాల ఆధారంగా స్కామర్లు ఆయా యూజర్ల బ్యాంకు ఖాతాల నుంచి సొమ్ము లాగేస్తుంటారు. ఈ ఘటనకు సంబంధించి ఏప్రిల్ 3న గౌతం బుద్ధ్ నగర్ పోలీసులు ఆరుగురు సభ్యులతో కూడిన ముఠాను అదుపులోకి తీసకున్నారు. సైబర్ నేరగాళ్ల ముఠాలో ఎక్కువ మంది సభ్యులు వినీత్ కుమార్, ధ్రువ్ సోలంకి, గౌరవ్ తలాన్, సల్మాన్ ఖాన్, సంతోష్ మౌర్య, మనోజ్ మౌర్య ఉన్నారు. నిందితులు నుంచి పోలీసులు మూడు ల్యాప్టాప్లు, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు డెబిట్ కార్డులు, రూ. 11,700 నగదు, హ్యుందాయ్ ఐ19 కారును స్వాధీనం చేసుకున్నారు.
Read More