Hyderabad | వైద్యం పేరుతో ఓ నవవధువుపై నకిలీబాబా అత్యాచారం చేశాడు. దెయ్యం వదిలిస్తానని చెప్పి కళ్లకు గంతలు కట్టి మరి అఘాయిత్యం చేశాడు. ఈ విషయం చెబితే అండగా నిలబడాల్సిన అత్తమామలు కూడా దొంగ బాబాకే మద్దతు పలికారు. పైగా ఆమెను ఒక గదిలో బంధించారు. చివరకు తల్లిదండ్రుల సాయంతో బయటపడిన నవవధువు పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్లోని పాతబస్తీలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. హుస్సేనీ ఆలం ప్రాంతానికి చెందిన ఓ యువతికి మూడు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత యువతి ఆరోగ్యం క్షీణించింది. ఇటీవల ఆమె పరిస్థితి క్షీణించడంతో బండ్లగూడలోని ఓ బాబా వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఆ నవవధువును పరిశీలించిన బాబా.. ఆమె శరీరంపై 5 దెయ్యాలు ఉన్నాయని.. వాటిని వదిలించాలని వధువు అత్తమామలను నమ్మించాడు. దెయ్యాలను వదిలించేందుకు వాళ్లు సరే అనడంతో.. వారిని బయట ఉండమని చెప్పి ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లాక ఆమె కండ్లకు గంతలు కట్టి అత్యాచారం చేశాడు. బయటకు వచ్చి వధువు అత్తమామలతో దెయ్యాలు వదిలించానని చెప్పాడు. దీంతో వారు నవవధువును ఇంటికి తీసుకెళ్లారు. బాబా అకృత్యంతో మానసిక వేదనకు గురైన ఆ యువతి.. తన భర్తకు, అత్తమామలకు జరిగిన విషయం చెప్పింది. కానీ వాళ్లు పట్టించుకోలేదు సరికదా.. ఆమెకు ఇంకా దెయ్యం వదలలేదని చెప్పి ఓ గదిలో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు అత్తింటికి వచ్చి నిలదీశారు. ఏం జరిగిందని కూతుర్ని అడగ్గా.. తనకు జరిగిన అన్యాయం మొత్తాన్ని వివరించింది. అనంతరం తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే ఘటన బండ్లగూడ పరిధిలో జరగడంతో కేసును అక్కడికే భవానీ నగర్ పోలీసులు బదిలీ చేశారు. కాగా విషయం బయటపటంతో నకిలీ బాబా పరారయ్యాడు.