లక్నో : మాజీ సైనికుడి భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రించిన ఘటన యూపీలోని షహజనపూర్ తిల్హార్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఆర్మీ అధికారి తొలుత యాక్సిడెంట్లో మరణించాడని అనుమానించిన పోలీసులకు తదుపరి దర్యాప్తులో అది హత్యగా వెల్లడైంది. గతంలో ఆర్మీలో పనిచేసిన మృతుడు ధన్పాల్ మార్చి 4న రజన్పూర్ కనెక్టింగ్ రోడ్లో పార్క్ చేసిన కారులో విగతజీవిగా కనిపించాడు. ధన్పాల్పై నుంచి ముఖేష్ అనే వ్యక్తి కారు దూసుకువెళ్లడంతో ఆయన మరణించిఉంటాడని తొలుత భావించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురుగ్రాంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ధన్పాల్ ఓరోజు విధులు ముగించుకుని ఇంటికి రాగా, తన భార్య మధు ముఖేష్తో సన్నిహితంగా ఉంటూ ఆయన కంటపడింది. తమ అనైతిక బంధం భర్తకు తెలియడంతో మధు, ముఖేష్లు కలిసి ధన్పాల్ను హత్య చేశారని దర్యాప్తులో వెల్లడైంది. ముఖేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిని ప్రశ్నించగా నేరానికి పాల్పడినట్టు అంగీకరించాడు. మధు సూచనతోనే తాను ధన్పాల్ను కారుతో గుద్ది చంపానని, అయితే బురదలో కారు చిక్కుకుపోవడంతో వాహనాన్ని వదిలేసి పారిపోయానని చెప్పాడు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసినట్టు పోలీసులు తెలిపారు.