కోల్కతా : బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ స్కాంకు సంబంధించి ఈడీ కోల్కతా పరిసర ప్రాంతాల్లో ఐదు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది. ఈ స్కాంలో అరెస్టయిన మంత్రి పార్ధఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందిన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బెల్గోరియా ఫ్లాట్కు చేరుకున్న ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అర్పిత ముఖర్జీకి చెందిన కోల్కతా ఫ్లాట్లో గతవారం ఈడీ అధికారులు రూ 22 కోట్ల నగదు, 20కి పైగా మొబైల్ పోన్లు స్వాధీనం చేసుకున్నారు.
రిక్రూట్మెంట్ స్కాంలో అర్పిత ముఖర్జీని ఈడీ అధికారులు ప్రశ్నించిన మర్నాడే తాజా దాడులు జరగడం గమనార్హం. అర్పిత ముఖర్జీని ఆగస్ట్ 3వరకూ ఈడీ కస్టడీని కోర్టు అనుమతించింది. ఇక ఇదే కేసులో మంత్రి పార్ధ ఛటర్జీని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, తన ఇంటితో పాటు మరో మహిళ ఇంటిని కూడా మినీ బ్యాంక్లా మంత్రి పార్ధా వాడుకున్నట్లు తెలిపింది. మరో మహిళ కూడా మంత్రి పార్ధాకు సన్నిహితురాలని అర్పిత వెల్లడించింది.
తన ఇంటిలోని రూమ్లో ఎంత సొమ్ము ఉందో మంత్రి ఎప్పుడూ బయటకు చెప్పలేదన్నది. ఓ బెంగాలీ నటుడు తనను మంత్రి పార్ధాకు పరిచయం చేయించాడని, 2016 నుంచి ఇద్దరి మధ్య పరిచయం ఉన్నట్లు ఆమె చెప్పారు. ట్రాన్స్ఫర్లు, కాలేజీ గుర్తింపు కోసం ఇచ్చిన లంచాలదే ఆ డబ్బు మొత్తం అని ఆమె తెలిపింది. కానీ ఆ డబ్బును మంత్రి ఎప్పుడూ తీసుకురాలేదని, అతని మనుషులు మాత్రమే తెచ్చేవారని ఆమె చెప్పింది.