లక్నో : డిన్నర్ లో సలాడ్ చేయలేదని తాగిన మైకంలో భార్యను దారుణంగా హత్య చేసిన వ్యక్తి ఉదంతం యూపీలోని షమ్లి జిల్లాలో వెలుగుచూసింది. గొగ్వాన్ జలాల్పూర్ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. పీకలదాకా మద్యం సేవించి ఇంటికి వచ్చిన నిందితుడు మురళీ కుమార్ రాత్రి భోజనంలో సలాడ్ కావాలని భార్య సుధేష్ దేవిని అడిగాడు.
ఆమె సలాడ్ ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన నిందితుడు వాగ్వాదానికి దిగాడు. కుమారుడు అడ్డుపడటంతో అక్కడి నుంచి వెళ్లిన నిందితుడు తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరుకుని నిద్రిస్తున్న భార్యపై దాడి చేశాడు. కుమారుడి పైనా దాడికి పాల్పడ్డాడు. గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. కుమారుడు అజయ్ కు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నిందితుడు మురళీ కుమార్ ను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.