ముంబై : జోహాన్స్బర్గ్ నుంచి ముంబైకి రూ 56 కోట్ల విలువైన 8 కిలోల హెరాయిన్ను తరలిస్తున్న దక్షిణాఫ్రికా జాతీయుడిని ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని మీజ్ లిండోకులెగా గుర్తించారు. ఎయిర్పోర్ట్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని శనివారం కస్టమ్స్ విభాగం ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ సిబ్బంది అడ్డగించారు.
జోహన్స్బర్గ్ నుంచి కిగాలి మీదుగా రువాండా ఎయిర్ ఫ్లైట్ డబ్ల్యూబీ-500లో నిందితుడు ముంబై ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. అతడి లగేజ్లో 8 కిలోల డ్రగ్స్ను అధికారులు గుర్తించారు. పరీక్షల్లో మత్తుపదార్ధం హెరాయిన్గా కనుగొన్నారు. రెండు ట్రాలీ బ్యాగులు, హాండ్ బ్యాగ్లో డ్రగ్స్ను నిందితుడు తరలిస్తుండగా పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ రూ 56 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
జోహాన్స్బర్గ్ నుంచి డ్రగ్స్ను తరలించిన నిందితుడు వీటిని ముంబైలోని గుర్తుతెలియని వ్యక్తికి అప్పగించాల్సి ఉంది. ఇక మరో ఘటనలో డ్రగ్స్ కేసులో అరెస్టయి బెయిల్పై ఉన్న నైజీరియాకు చెందిన వ్యక్తి నవీ ముంబైలో రూ 22 లక్షల విలువైన డ్రగ్స్ను తరలిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి మత్తుపదార్ధాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశామని నవీ ముంబై పోలీస్ కమిషనర్ బిపిన్ కుమార్ సింగ్ చెప్పారు.