మన్సూరాబాద్ : మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారును నడుపుతూ డివైడర్ను డీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతివేగంతో కారు ప్రమాదానికి గురై పల్టీ కొట్టిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. కర్మన్ఘాట్, గ్రీన్పార్కు కాలనీకి చెందిన శ్రీనాథ్ (36) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మిత్రులతో కలిసి ఓ విందుకు హాజరైన శ్రీనాథ్ మద్యం మత్తులో కారు నడుపుతూ ఆదివారం తెల్లవారు జామున 3:30 గంటల సమయంలో నాగోల్ వైపు నుంచి కర్మన్ఘాట్కు వెళ్తున్నాడు.
మద్యం మత్తులో ఉన్న అతడు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అండర్పాస్ వద్దకు రాగానే ఎదురుగా ఉన్న డివైడర్ను అతివేగంతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు పల్టీకొట్టింది. కారు ప్రమాదానికి గురైన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు కారులో చిక్కుకున్న శ్రీనాథ్ను బయటకు తీశారు. కారు నుజ్జునుజైనప్పటికీ శ్రీనాథ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కారులో మరెవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి కారకుడైన శ్రీనాథ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.