న్యూఢిల్లీ : ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రూ 434 కోట్ల విలువైన 62 కిలోల హెరాయిన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్లో కొరియర్, కార్గో, ఎయిర్ ప్యాసెంజర్ మార్గాల్లో హెరాయిన్ను భారీస్ధాయిలో సీజ్ చేయడం ఇదే తొలిసారని ఆర్ధిక మంత్రిత్వ శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆపరేషన్ బ్లాక్ అండ్ వైట్ పేరుతో డీఆర్ఐ అధికారులు ఇంపోర్టెడ్ కార్గో కన్సైన్మెంట్ నుంచి 55 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీ బ్యాగ్స్లో మాదక ద్రవ్యాలను నింపి అధికారుల కండ్లు కప్పి దేశంలోకి తరలించేందుకు డ్రగ్ మాఫియా ఆగడాలను డీఆర్ఐ సిబ్బంది భగ్నం చేసింది. దుబాయ్ మీదుగా ఉగాండా నుంచి ఈ కన్సైన్మెంట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ కార్గో కాంప్లెక్స్కు చేరుకుంది.
ఈ దాడుల్లో రాబట్టిన సమాచారం ఆధారంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ మరో ఏడు కిలో హెరాయిన్ రూ 50 లక్షల నగదు పట్టుబడింది. పట్టుబడిన 62 కిలోల హెరాయిన్ విలువ మార్కెట్లో రూ 434 కోట్లు ఉంటుందని అంచనా. ఇక కన్సైన్మెంట్ దిగుమతిదారును డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసులో అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.