న్యూఢిల్లీ: లండన్లో డాక్టర్గా పని చేస్తున్న ఒక మహిళ, ఢిల్లీలోని ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. అయితే ఆ ఇంట్లో సూసైడ్ నోట్ లభించిందని పోలీసులు తెలిపారు. 40 ఏండ్ల మేఘా కయల్, గత ఏడాదిగా లండన్లోని మిల్టన్ కీన్స్ యూనివర్సిటీ హాస్పిటల్లో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నారు. అంతకు ముందు ఢిల్లీలోని సరితా విహార్లోని అపోలో ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేశారు. అయితే 79 ఏండ్ల ఆమె తల్లి ఇటీవల మరణించారు. దీంతో ఆమె ఢిల్లీకి వచ్చారు. తండ్రి కూడా క్యాన్సర్ రోగి.
కాగా, తల్లి చనిపోయిన నాటి నుంచి మేఘా చాలా డిప్రెషన్తో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం ఎంతకీ బెడ్ రూమ్ తలుపు తీయకపోవడంతో అనుమానంతో ఆమె వదిన మరో తాళంతో తలుపు తెరిచారు. ఒంటిపై గాయాలతో అచేతనంగా పడి ఉన్న మేఘాను గమనించి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు చెప్పారు.
మరోవైపు ఆసుపత్రి నుంచి ఈ సమాచారం అందుకున్న పోలీసులు దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లో ఉన్న మేఘా నివాసానికి వెళ్లారు. ఆమె చనిపోయిన గదిని పరిశీలించగా ఒక సూసైడ్ నోట్ లభించింది. అయితే కుటుంబ సభ్యులపై ఎలాంటి అనుమానం లేదని పోలీసులు తెలిపారు. డిప్రెషన్ వల్లనే ఆమె చనిపోయిందని భావిస్తున్నారు. మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత స్పష్టత వస్తుందని అన్నారు.