ముంబై : దేశవ్యాప్తంగా గత కొద్దినెలలుగా ఆన్లైన్ స్కామ్లు (Cyber Fraud) విపరీతంగా పెరుగుతున్నాయి. లేటెస్ట్గాముంబైలోని శాంతాక్రజ్లో నివసించే డాక్టర్ జంట నుంచి స్కామర్లు రూ. 90,000 కొట్టేశారు. హరీష్ బెదెకర్ (59) ఆయన భార్య ప్రాచీ ఇద్దరూ వైద్య వృత్తిలో కొనసాగుతూ వివిధ విద్యా సంస్ధల్లో కౌన్సెలింగ్ లెక్చర్స్ ఇస్తుంటారు. వీరి వద్ద పనిచేసే అఖిలేష్ చౌబే ఓ ఆర్మీ స్కూల్లో కౌన్సెలింగ్ సెషన్ ఇచ్చే అవకాశం ఉందని ప్రాచీకి తెలిపాడు. ఆర్మీ అధికారిగా చెప్పుకున్న సంతోష్ కుమార్ అనే వ్యక్తి ఈ ఆఫర్తో ముందుకొచ్చాడు.
కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తానని సంతోష్ నమ్మబలికాడు. చర్చ్గేట్లో ని ఆర్మీ స్కూల్లో లెక్చర్ ఇవ్వాల్సి ఉంటుందని ప్రాచీకి తెలిపాడు. ఈ సెషన్కు హాజరైతే డాక్టర్ దంపతులకు రూ. 50,000 చెల్లిస్తామని చెప్పాడు. ఆర్మీ ఉద్యోగి డిజిటల్ పేమెంట్ చేపడతామని చెప్పి స్కామ్కు తెరలేపాడు. ఆర్మీ అధికారిగా చెప్పుకున్న స్కామర్ హరీష్కు వీడియో కాల్ చేసి పేటీఎం అకౌంట్ ఓపెన్ చేయాలని కోరాడు.
అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కొద్దిసేపటికి హరీష్ తన బ్యాంక్ ఖాతా నుంచి రూ. 50,000 డెబిట్ అయినట్టు గుర్తించడంతో షాక్ తిన్నాడు. ఊహించని రీతిలో తన ఖాతా నుంచి సొమ్ము మాయం కావడంతో వీడియోకాల్ను కట్ చేశాడు. అయితే తన ఖాతా నుంచి మరో 40,000 డెబిట్ అయినట్టు మెసేజ్ రావడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్లో వైద్య జంట కేసు నమోదు చేయగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :