న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం వెలుగుచూసింది. 16 ఏండ్ల దివ్యాంగ బాలికపై పొరుగింటి వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఢిల్లీలోని మహేంద్ర పార్క్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడి(24)ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలిక శనివారం తమ గుడిసెలో నిద్రిస్తుండగా బాలిక పట్ల నిందితుడు అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.
బాలిక తల్లి మెలకువతో నిద్ర నుంచి లేవగా నిందితుడు ఘటనా స్ధలం నుంచి పరారయ్యాడు. బాలిక తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కొద్దిరోజుల కిందట ఢిల్లీలో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న మహిళ (26)తో ఆమెకు పరిచయమున్న ఇద్దరు ఫ్యాక్టరీ కార్మికులు మాటకలిపి ఆపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
బాధితురాలిని సమీపంలోని పార్క్కు తీసుకువెళ్లి దారుణానికి పాల్పడ్డారు. అంతటితో మహిళను విడిచిపెట్టని నిందితులు ఆమెను సమీపంలోని మురికివాడలోని కిరాయి ఇంటికి తీసుకువెళ్లి మరోసారి నేరానికి పాల్పడ్డారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.