రంగారెడ్డి : ప్రమాదవశాత్తు డిటోనేటర్లు పేలి ఇద్దరికి గాయాలైన సంఘటన మండలంలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మల్కీజ్గూడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం..మల్కీజ్గూడ గ్రామ సమీపంలోని గుండెల్లి మల్లేష్ అనే వ్యక్తికి చెందిన వ్యవసాయ బావి వద్ద అదే గ్రామానికి చెందిన రాజశేఖర్, లక్ష్మణ్లు బావి పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తగులబెట్టారు.
ఇంతలోనే పెద్ద శబ్ధంతో కూడిన పేలుడు చోటు చేసుకుంది. ప్రమాదంలో రాజశేఖర్, లక్ష్మణ్ గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే దవాఖానాకు తరలించారు. వ్యవసాయ బావి ఊరికి అతి సమీపంలో ఉండగా పేలుడు దాటికి పశువుల పాక రేకులు ఎగిరిపడటంతో పాటు మూడు ఇండ్లు ధ్వంసమయ్యాయి.
ఇందులో రెండిండ్ల పైకప్పు రేకులు ధ్వంసమవ్వగా ఓ ఇంటి అద్దాలు పగిలిపోయాయి. చెత్తాచెదారంలో ఉన్న డిటోనేటర్లకు నిప్పంటుకోవడంతోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు గుర్తించారు. డిటోనేటర్లు ఎక్కడినుంచి వచ్చాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.