విజయవాడ: దాదాపు రూ. కోటిన్నర విలువ చేసే 3 కిలోల బంగారు నగలతో డెలివరీ బాయ్స్ పరారయ్యారు. వీరిపై విజయవాడలోని కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. యజమానిని నమ్మించి బంగారు నగలతో డెలివరీ బాయ్స్ ఉడాయించినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఇద్దరు డెలివరీ బాయ్స్పై కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు.
కొత్తపేట కోమల విలాస్ సెంటరులోని ఎస్ఎస్ టవర్స్లో రాజస్థాన్కు చెందిన సునీల్ కుమార్ నివాసముంటున్నాడు. ముంబైకి చెందిన జైమాతాది కార్గో ప్రైవేటు లిమిటెడ్ నుంచి ఫ్రాంచైజీ తీసుకొని ‘జైమాతాది లాజిస్టిక్స్’ పేరుతో ఐదేండ్లుగా కొరియర్ సర్వీసును చేపడుతున్నాడు. ముంబై నుంచి కొరియర్ ద్వారా వచ్చే నగలు, డైమండ్స్ను రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో డెలివరీ చేస్తుంటారు. నగలు, డైమండ్స్ డెలివరీ చేసేందుకు పలువురు బాయ్స్ను సునీల్ కుమార్ తన వద్ద పనిలో పెట్టుకున్నాడు. అతడి వద్ద పనిచేస్తున్న ఇద్దరు.. బంగారం డెలివరీ చేసేందుకు వెళ్లి అట్నుంచి అటే ఉడాయించారు.
ఈ నెల 7న ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన కార్గో విమానం నుంచి ఆభరణాల తాలూకు బాక్సులను యజమాని తీసుకెళ్లాడు. అనంతరం ఆ ఆభరణాలను ప్రాంతాల వారీగా డెలివరీ చేయడానికి విడిగా ప్రత్యేక బాక్సుల్లో ప్యాకింగ్ చేయించాడు. అందులో కొన్ని బాక్సులను డెలివరీ బాయ్స్.. రాజీవ్ శర్మ, భవానీసింగ్కు ఇచ్చి డెలివరీ చేయమని ఈ నెల 8వ తేదీన సునీల్ పురమాయించాడు. రైలులో పంపిన తర్వాత సునీల్ వారితో ఫోన్లో మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటున్నాడు. అయితే, కొద్దిసేపటి తర్వాత వారిఫోన్లు స్విచ్ఛాఫ్అయ్యాయి. డెలివరీ తీసుకోవాల్సిన వారికి ఫోన్ చేస్తే వారు రాలేదని సమాధానం వచ్చింది. దాంతో వారిద్దరు ఉడాయించినట్లుగా భావించిన యజమాని.. పోలీసులను ఆశ్రయించాడు. వీరు దాదాపు రూ.1.5 కోట్లు విలువైన 3 కేజీల ఆభరణాలతో పారిపోయారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.