న్యూఢిల్లీ: వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పట్టుకునేందుకు ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. గోల్డ్ చైన్ ధరించిన మహిళా పోలీస్ను ఎర వేయడంతో అతడు దొరికిపోయాడు. నైరుతీ ఢిల్లీలోని ద్వారకతో పాటు పొరుగు ప్రాంతాల్లో ఇటీవల చైన్ స్నాచింగ్లు పెరిగాయి. బైక్పై వెళ్లే ఒక వ్యక్తి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని బంగారు గొలుసులను లాక్కొనిపోతున్నాడు.
చైన్ స్నాచింగ్ కేసులు పెరుగడంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందడంతో ఢిల్లీ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఆ చైన్ స్నాచర్ను పట్టుకునేందుకు ‘హమ్ భీ హై’ పేరుతో ఒక ఆపరేషన్ చేపట్టారు. స్నాచర్ను పట్టుకునే కీలక బాధ్యతను మహిళా పోలీస్ అధికారిణి సరోజ్ సింగ్కు అప్పగించారు. ఆ చైన్ స్నాచర్ను అర్మాన్గా గుర్తించిన పోలీసులు అతడి కదలికలపై నిఘా పెట్టారు.
కాగా, శనివారం ద్వారకా సెక్టార్ 13లో అర్మాన్ ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే తమ ఆపరేషన్ను ప్రారంభించారు. సాధారణ దుస్తుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ సరోజ్ సింగ్, గోల్డ్ చైయిన్ ధరించి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నారు. మఫ్టీలో ఉన్న మిగతా పోలీసులు నిందితుడు తప్పించుకోకుండా ఆమెకు కవర్గా నిలిచారు.
ఇంతలో అర్మాన్ అక్కడకు వచ్చాడు. క్యాజువల్ డ్రెస్లో ఉన్న ఎస్ఐ సరోజ్ సింగ్ మెడలోని బలమైన బంగారు చైన్ను స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే పోలీసులు అతడ్ని చుట్టుముట్టారు. దీంతో తప్పించుకునేందుకు అర్మర్ గన్తో కాల్పులు ప్రారంభించాడు. అప్రమత్తమైన మహిళా ఎస్ఐ సరోజ్ సింగ్, తన వద్ద ఉన్న గన్తో అతడి కాలుపై కాల్పులు జరిపింది. గాయపడిన అర్మన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఢిల్లీలోని జహంగీర్పురిలో నివాసం ఉండే 22 ఏండ్ల అర్మాన్ పై 60కిపైగా చోరీ కేసులు ఉన్నాయని పోలీస్ అధికారి శంకర్ చౌదరి తెలిపారు. పొరుగున ఉన్న గుర్గావ్లో 25 దొంగతనం కేసులు నమోదయ్యాయని చెప్పారు. అతడి అరెస్టుతో ద్వారకా జిల్లాలో 36 స్నాచింగ్ కేసులను ఛేదించినట్లు వెల్లడించారు.