న్యూఢిల్లీ : దేశ రాజధానిలో పాలం వద్ద మైనర్ బాలికను అపహరించి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన నిందితుడు సంతోష్ సుభాష్ గమ్నె అలియాస్ గోల్ గమ్నెపై పలు క్రిమినల్ అభియోగాలున్నాయని పోలీసులు తెలిపారు. గమ్నె గత ఏడాది మే 16న పాలం ప్రాంతంలోని బాలికను ఆమె ఇంటి నుంచి అపహరించాడు. మే 18న బాలిక తల్లి పాలం పోలీసులను ఆశ్రయించగా బాధితురాలు గతంలో ఓ సారి కిడ్నాప్ అయిన క్రమంలో గత కేసులో నిందితుడు గమ్నెను ప్రదాన నిందితుడిగా అనుమానించారు.
నిందితుడు మహారాష్ట్రకు చెందిన వాడు కావడంతో గత కేసు తరహాలోనే ఆయా ప్రాంతాల్లో నిందితుడి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. గతంలో బాలికను నాగపూర్లో పోలీసులు నిందితుడి చెర నుంచి కాపాడారు. ఇక 2021 నవంబర్లో పోలీసుల బృందం మహారాష్ట్రలో బాలికను గుర్తించగా నిందితుడు పోలీసుల కండ్లు కప్పి బాలికను వేరే ప్రాంతానికి తీసుకువెళ్లాడు. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 4న గుజరాత్లోని సూరత్లో బాలికతో కలిసి తలదాచుకున్న నిందితుడు గమ్నెను పాలం పోలీసులు పట్టకున్నారు.
విచారణలో భాగంగా బాలికను తాను 2020లో కూడా కిడ్నాప్ చేశానని నిందితుడు వెల్లడించాడు. అప్పట్లో నాగపూర్లో నిందితుడిని అరెస్ట్ చేసిన అనంతరం మహారాష్ట్ర నుంచి బాలికను కాపాడారు. ఈసారి కూడా బాలికను నాగపూర్కు తీసుకువెళ్లిన గమ్నె ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు నిందితుడు తరచూ వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ ఫోన్ నెంబర్లు మారు
స్తుండేవాడు. మహారాష్ట్ర పోలీసులు సైతం దోపిడీ, కిడ్నాపింగ్, హత్య కేసుల్లో గమ్నెపై తుమ్సర్ మేజిస్ట్రేట్ కోర్టులో పలు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు.