న్యూఢిల్లీ: కరోనా వల్ల దేశంలో లాక్డౌన్ విధించిన సమయంలో కూలీలను విమానంలో వారి సొంతూర్లకు పంపిన రైతు, గుడిలో అనుమానాస్పదంగా మరణించాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. పుట్టగొడుగుల రైతు పప్పన్ సింగ్ గెహ్లాట్, ఢిల్లీలోని అలీపూర్ ప్రాంతంలో తన ఇంటి ఎదురుగా ఉన్న ఆలయంలో ఫ్యాన్కు వేలాడుతూ బుధవారం అనుమానాస్పదంగా చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నాడు. అనారోగ్యం వల్ల తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా అందులో ఉన్నది. పోస్ట్మార్టం కోసం ఆయన మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, 55 ఏళ్ల పప్పన్ సింగ్ గెహ్లాట్ 2020లో వార్తల్లో నిలిచాడు. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో తన వద్ద పని చేస్తున్న బీహార్కు చెందిన వలస కూలీలను విమానంలో వారి సొంత ఊర్లకు పంపాడు. కరోనా పరిస్థితి మెరుగుపడిన తర్వాత కూడా ఆ కూలీలను విమానంలో తిరిగి ఢిల్లీకి రప్పించాడు.