యాచారం : అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దర్పల్లిలో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. దర్పల్లి గ్రామానికి చెందిన కొండాపురం ఈశ్వరయ్య (44) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కుమారుడు, కూతురు ఉంది. ఎనిమిది నెలల క్రితం కూతురు వివాహం చేశాడు. కూతురు పెళ్లి కోసం చేసిన అప్పు వడ్డీతో కలిపి రెట్టింపయ్యింది. అప్పు తీర్చలేక మానసికంగా ఇబ్బందిపడేవాడు. అప్పు ఇచ్చిన వారు తరచూ అడగడంతో చేసేదేమిలేక 27న ఇంట్లో నుంచి తన టీవిఎస్ వాహనంపై వెళ్లి పోయాడు. గ్రామ సమీపంలో ఓ వేప చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.