న్యూఢిల్లీ : బాలికల అక్రమ రవాణా రాకెట్ను భగ్నం చేసిన ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ఈ ముఠా చెర నుంచి ఐదుగురు బాలికలను రక్షించింది. ఐదుగురు బాలికల్లో ఇద్దరిని మైనర్ బాలికలుగా గుర్తించారు. అక్టోబర్ 19న దురంతో ఎక్స్ప్రెస్లో ఢిల్లీ నుంచి ఐదుగురు బాలికలను పశ్చిమ బెంగాల్కు తరలిస్తున్నారని శక్తి వాహిని అనే ఎన్జీఓ డీసీడబ్ల్యూకు సమాచారం అందించింది. చైల్డ్లైన్, పోలీస్ అధికారులతో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్కు చేరుకున్న డీసీడబ్ల్యూ బృందం ఐదుగురు బాలికలను అక్రమార్కుల చెర నుంచి విడిపించింది.
తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతూ జైనా అనే మహిళ, లాడెన్ అనే వ్యక్తి ఢిల్లీకి తీసుకువచ్చారని బాధిత బాలికలు తెలిపారు. మదన్పూర్ ఖదర్ గ్రామంలోని ఓ రూంలో తమను నిర్బంధించారని చెప్పారు. నిందితులు తమను ఢిల్లీలో కొందరికి విక్రయించాలని ప్రయత్నించారని కూడా వారు పేర్కొన్నారు. గత కొంతకాలంగా తమపై నిందితులకు తెలిసిన వారు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కొందరు బాలికలు తెలిపారు.