జైపూర్ : యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడనే కోపంతో దళిత యువకుడిని కొందరు కొట్టిచంపిన ఘటన రాజస్ధాన్లోని హనుమాన్ఘఢ్లో వెలుగుచూసింది. యువకుడిపై దాడి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గురువారం సాయంత్రం చివరిసారిగా కనిపించిన యువకుడు రాత్రికి విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది.
తమ కుమారుడిని కొందరు తీవ్రంగా కొడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో బయటకు వచ్చేంతవరకూ అతడు ఎలా చనిపోయాడనేది కుటుంబసభ్యులకు తెలియరాలేదు. నిందితులు యువకుడిని కిందపడేసి కర్రలతో కొడుతుండటం వీడియోలో కనిపించింది. బాధితుడి తల్లితండ్రుల ఫిర్యాదు ఆధారంగా 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులందరినీ అరెస్ట్ చేసే వరకూ ఆందోళన చేపడతామని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు నిరసనలకు దిగారు.