జైపూర్ : అతను ఓ దళిత యువకుడు. కానీ ఓ రాజు మాదిరి రాజసంగా ఉంటాడు. ఆరు అడుగుల అజానుబాహుడు.. అందమైన ముఖం.. మేలేసిన మీసాలు.. అతని సొంతం. ఈ మూడే ఆ యువకుడి చావుకు కారణమయ్యాయా? అంటే అవుననే అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
రాజస్థాన్ పాలి జిల్లాలోని బార్వా గ్రామానికి చెందిన జితేంద్రపాల్ మేఘవాల్ అనే దళిత యువకుడు.. కొవిడ్ 19 హెల్త్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. జితేంద్ర పాల్ కున్వార్ సా జిత్ పేరిట సోషల్ మీడియాలో ఓ అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆ అకౌంట్లో తన ఫోటోలను షేర్ చేస్తూ.. నేను ధనవంతుడిని కాదు.. కానీ మనసులో మాత్రం రాజుని అని ట్యాగ్ లైన్ ఇస్తుంటాడు. అయితే ఇలా ఫోటోలు షేర్ చేయడం కొందరికి నచ్చక.. జితేంద్ర పాల్పై గతంలో కొన్నిసార్లు ఘర్షణ పడ్డారు.
అయితే జితేంద్ర పాల్ తన స్నేహితుడు హరీష్ కుమార్తో కలిసి మంగళవారం బాలి నుంచి బార్వాకు బైక్పై వెళ్తున్నాడు. బాలికి రెండు కిలోమీటర్ల దూరంలో సూరజ్ సింగ్, రమేశ్ సింగ్ కలిసి జితేంద్ర పాల్ బైక్ను ఆపాలని ఆదేశించారు. అంతలోనే వెనుకాల కూర్చొన్న జితేంద్రపై కత్తితో దాడి చేశారు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జితేంద్ర పాల్ హత్యకు అందం, మీసాలు కారణం కాదని పోలీసులు చెప్పారు. 2020లో జరిగిన ఓ గొడవ వల్లే సూరజ్, రమేశ్ సింగ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.