ముంబై : దేశ వాణిజ్య రాజధానిలో దారుణం వెలుగుచూసింది. మహిళ (24)ను లైంగిక వేధింపులకు గురిచేయడంతో పాటు బెదిరింపులకు పాల్పడి రూ 4.5 లక్షలకు మోసగించిన ఉదంతం మహారాష్ట్ర రాజధాని ముంబైలో బయటపడింది. ఆమె తీసుకోని రుణాన్ని చెల్లించకపోతే అశ్లీల మెసేజ్లు, ఫోటోలతో ప్రతిష్టకు భంగం కలిగిస్తామని నిందితులు పలు మొబైల్ నెంబర్ల నుంచి ఫోన్లు చేసి బెదిరింపులకు గురిచేశారు.
అధికంగా డబ్బు చెల్లించేందుకు మహిళ నిరాకరించడంతో ఆమెను సెక్స్ వర్కర్గా పేర్కొంటూ పలు సోషల్ మీడియా సైట్లలో మొబైల్ నెంబర్ను పోస్ట్ చేశారు. బాధితురాలి నుంచి రూ 4.5 లక్షలు కాజేసినా మరింత మొత్తం రాబట్టేందుకు ఆమెను తీవ్ర వేధింపులకు గురిచేశారు. మహిళ ఫిర్యాదు ఆధారంగా ఏప్రిల్ 14న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆన్లైన్ లోన్ యాప్ వాల్బై నుంచి తీసుకున్న రుణాన్ని చెల్లించాలని గుర్తుతెలియని నెంబర్ నుంచి మార్చి 30న ఆమెకు మెసేజ్ వచ్చినప్పటి నుంచి సైబర్ నేరగాళ్ల ఆగడాలు మొదలయ్యాయి.
ఈజీ క్రెడిట్, ఒబిక్యాష్, పియంప్ వాలెట్, యస్ క్యాష, క్యాష్ పాకెట్, రూపీ లైన్, ఒక్కో, జోజో ఎన్ యాప్ల నుంచి కూడా లోన్ తీసుకున్నట్టు ఆమెకు మెసేజ్లు వచ్చాయి. తమకు లోన్ అమౌంట్ చెల్లించకుంటే ఆమె కాంటాక్ట్ నెంబర్లు, బంధువులకు అభ్యంతరకర ఫోటోలు పంపుతామని బెదిరిస్తూ రూ 4.5 లక్షలు బాధితురాలి నుంచి నిందితులు కాజేశారు. మహిళ పిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.